Bapu-Ramana Music Hits

Sunday, June 5, 2011

నేడే చూడండి.. మీ అభిమాన ఆర్ట్ గ్యాలరీలో... బాపు బొమ్మల కొలువు


సోదరిసోదరీమణులారా...నేడే చూడండి...మీ అభిమాన ఆర్ట్ గ్యాలరీలో...బాపు బొమ్మలకొలువు...బాపు బొమ్మలకొలువు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ కలిసి ప్రారంభించిన అపురూప చిత్ర ప్రదర్శన "బాపు బొమ్మల కొలువు''. ప్రతిరోజు రెండు ఆటలు. ఉదయం 11గంటలకు మార్నింగ్‌షో, సాయంత్రం 5 గంటలకు ఫస్ట్‌షో. (సినిమా రిక్షాలో వినిపించే మైక్ అనౌన్స్‌మెంట్‌లా చదువుకో ప్రార్థన)

దర్శకుడు వంశీ కథలోని దేవాంగులమణి అద్దం ముందు కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతూ కొప్పు ముడేసుకుంటుంది. వెనక పసలపూడి ఊరంతా కనబడుతోంది. ఆ బొమ్మ ముందు నిల్చొని 'వంశీ' విభ్రమంగా ఫొటో తీయించుకుంటున్నారు. ఈ బొమ్మల కింద రేట్లు వేయలేదా అని అక్కినేని అంటున్నారు. సీమ సమరసింహారెడ్డి బొమ్మ ఏదైనా ఉందేమోనని బాలకృష్ణ వెతుకుతున్నాడు. మద్రాసు నుంచి కార్టూనిస్టు సురేంద్ర, నర్సింలు రెక్కలు కట్టుకుని వచ్చారు.

నాగార్జునసాగర్ నుంచి సుదర్శన్‌సారు మూటాముల్లె సర్దుకొని రాందేవ్ బాబా మీటింగ్‌కి వచ్చినట్టు వచ్చారు. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తే బొమ్మల కొలువు టైమ్‌కి అందుకోలేనని ఇంటికి వెళ్లకుండా రాత్రంతా జాగారం చేసి మరీ నేను హాజరయ్యాను. అందరూ వచ్చి ఇంత ఆబగా చూస్తున్నది ఏంటయ్యా అంటే బాపు బొమ్మలు. 1960, 70 ల్లో తెలుగు పత్రికల్లో నిండిపోయిన బాపు బొమ్మల ఒరిజినల్స్ ప్రదర్శన జరుగుతోంది మరి.

ఎగ్జిబిషన్‌కి వచ్చినవాళ్లు ఆ బొమ్మల్ని చూసుకుంటూ ఎవరి జ్ఞాపకాల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. ఈ బొమ్మ కథ నేను 70 ల్లో ఇంటర్‌లో ఉండగా చదివానని ఒకాయన, ఈ బొమ్మ నేను ఆంధ్రజ్యోతిలో 80 ల్లో చూశానని ఒకావిడ. ఆ కార్టున్ చూసి అప్పట్లో తెగ నవ్వారని ఇప్పుడూ నవ్వుతున్నానని ఓ ముసలాయనా..పిల్లలకు బొమ్మల్ని అపురూపంగా చూపిస్తున్న తల్లులు, తండ్రులు. ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ బాపు, ఆయన చుట్టూ ఆర్టిస్టుల మూక, క్లిక్‌మని ఫొటోలు, జూమ్‌మని వీడియోలు...సందడిసందడిగా ఉంది అక్కడి వాతావరణం.

తెలుగునాట ప్రసిద్ధ చిత్రకారులైన బాపుగారు అరశతాబ్దంగా వివిధ కథలకి, వేర్వేరు సందర్భాలకి వేసిన అపురూప చిత్రాలు చోటు చేసుకున్నాయి ఈ ప్రదర్శనలో. ఎన్నో కలర్ డ్రాయింగులు, బ్లాక్ అండ్ వైట్ ఇండియన్ ఇంక్ గీతలు సాధారణ డ్రాయింగ్ షీట్లమీద, ఖరీదైన టెక్చర్ పేపర్‌మీదా వేసినవి కనువిందు చేస్తున్నాయి. ఎక్కడ వెతికినా గీత తప్పురావడం, తుడవడానికి వైట్ కలర్ పూయడం కనిపించలేదు. బొమ్మల్లో అనాటమి అదిరిపోయి 'ఇలా ఎలా వేశాడ్రా బాపూ' అనుకోవడం ఆర్టిస్టుల వంతైంది. ముఖ్యంగా వంశీ కథలకి బాపు వేసిన బొమ్మలు అందరికీ ఆనందాన్ని పంచాయి.

ఇలాంటి దాదాపు వెయ్యి బొమ్మలదాకా ఈ బొమ్మలకొలువులో ఉంచారు ముఖీ మీడియావారు. కొన్ని ఒరిజినల్స్, కొన్ని ప్రింట్లు. మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ శని, ఆది, సోమవారాల్లో బాపు బొమ్మల ఎగ్జిబిషన్ జరుగుతోంది. తనికెళ్లభరణి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఆర్టిస్టులు మోహన్, ఏలెలక్ష్మణ్, పినిశెట్టి, అక్బర్‌లాంటి వాళ్లు వచ్చిపోతున్నారు. మీరందరూ కూడా వచ్చిపోవచ్చు. బొమ్మలు చూడొచ్చు. బుద్ధయితే ప్రింటన్లను కొనుక్కోవచ్చు. లేదంటే బాపు బొమ్మల సౌందర్యాన్ని చూసి ముక్కున వేలేసుకొని బయటికి ఫ్రీగా రావచ్చు. కమ్ మాన్. కమ్ విమెన్. కమ్ విత్ చ్రిల్డన్. * శేఖర్, కార్టూనిస్ట్

No comments: